News

రాష్ట్రవ్యాప్తంగా..కొత్త పాస్‌పుస్తకాలు మార్చి 11న పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా..కొత్త పాస్‌పుస్తకాలు మార్చి 11న పంపిణీ
రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానిస్తాం: సీఎం కేసీఆర్
-అదేరోజు నుంచి రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు
-ఎమ్మార్వోలకూ రిజిస్ట్రేషన్ అధికారాలు
-మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు
-రెవెన్యూశాఖ పర్యవేక్షణలోపారదర్శకంగా కొత్త విధానం
-కోర్ బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్‌సైట్ ధరణి
-ప్రక్షాళన తర్వాత స్పష్టంగా తేలిన భూవివరాలు
-త్వరలో రెండోదశ భూరికార్డుల ప్రక్షాళన
-వివాదాల్లో ఉన్న భూముల పరిష్కారానికి త్వరలో నిర్ణయాలు
-రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు
-కొత్త పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల విధానంపై 8 గంటలపాటు సమీక్షించిన సీఎం కేసీఆర్


రాష్ట్రవ్యాప్తంగా పూర్తి భద్రత కలిగిన ఫీచర్లతో రూపొందించిన సరికొత్త పాస్ పుస్తకాలను మార్చి 11న పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు తావులేకుండా మరింత పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మండల రెవె న్యూ అధికారులకు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల అధికారాలను కల్పించాలని నిర్ణయించింది. మార్చి 11నుంచి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలతోపాటు మండల రెవెన్యూ కార్యాలయాలలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. అన్ని గ్రామాలలో ఒకేరోజు (మార్చి 11న) కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రిని ఆహ్వానిస్తానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

ప్రక్షాళన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న భూమి వివరాలు పూర్తిగా ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాయని, దీని ఆధారంగా సమగ్రమైన వివరాలతో రైతుల పాస్‌పుస్తకాలను తయారుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తామన్నారు. కోర్‌బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి ధరణి పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. పూర్తిస్థాయి సంస్కరణలతో పటిష్ఠమైన విధానాన్ని మార్చి 11నుంచే అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అదేరోజు మండల రెవె న్యూ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూశాఖ ఆధీనంలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని వివరించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా ఉన్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొత్త పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ల విధానంలో సంస్కరణలపై శనివారం ప్రగతిభవన్‌లో దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, కార్యదర్శి స్మితాసబర్వాల్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ జీఎండీ శ్రీధర్, సీనియర్ మేనేజర్ సుధీర్ గోలి తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర భూ ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను సమావేశంలో విశ్లేషించారు.

త్వరలో రెండో దశ ప్రక్షాళన..
రాష్ట్రమంతటా వంద రోజులపాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన మొదటి దశ పూర్తిగా విజయవంతమైందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, ఏ భూమికి ఎవరు యజమాని అనేది తేలిందని పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగా కొత్త పాస్‌పుస్తకాలను ఇవ్వడంతోపాటు పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తామని వెల్లడించారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను రెండోదశ ప్రక్షాళనలో పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ఈ దిశగా అవసరమైన నిర్ణయాలను తీసుకుంటామని వివరించారు. మొదటి దశ భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షల వరకు ఉన్నట్లు తేలిందని సీఎం కేసీఆర్ అన్నారు.

కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి
రాష్ట్రంలోని ప్రతీ ఎకరం వివరాన్ని సమగ్రంగా పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను కూడా నమోదు చేస్తూ ధరణి అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో దీనిని నిర్వహిస్తామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌తోపాటు పేర్ల మార్పిడి వివరాలు ఏరోజుకారోజు ధరణిలో నమోదవుతాయని వివరించారు. మండల కార్యాలయం నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయిలో అన్నిచోట్ల నుంచి వెబ్‌సైట్ నుంచి వివరాలను తీసుకోవచ్చని చెప్పారు. విదేశాల్లో ఉన్నవారు కూడా ధరణి ద్వా రా క్రయవిక్రయాలు జరుపుకోవచ్చని వెల్లడించారు.

ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు
రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో మొ త్తం 584 మండలాలకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఈ సబ్‌రిజిస్ట్రార్ల పరిధిని వారి కార్యాలయమున్న మండలానికే పరిమితం చేస్తారు. మిగతా 443 చోట్ల ఎమ్మార్వోలకు సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తారు. ఎమ్మార్వోలు తామిచ్చిన అపాయింట్‌మెంట్ తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మార్వోలు హాజరు కాలేకపోతే, బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగిస్తారు. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వాహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతిని నిరోధించడం, నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడంలాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రైతులు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధతప్పాలి. ఒక్కసారే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రావాలి. పాస్‌పుస్తకం ఇంటికే కొరియర్ ద్వారా చేరా లి. అవినీతికి ఆస్కారం లేనివిధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉం డాలి. నకిలీ పాస్ పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించి రుణాలు పొందిన దాఖలాలున్నాయి. ఇకపై అలా సాధ్యం కాదు. భూ రికార్డుల నిర్వాహణను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది. అందుకే సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతీ విషయం ధరణిలో నమోదవుతుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో భూముల తాజా వివరాలు
-మొత్తం భూమి 1,12,077 చ.కి.మీ. (2.80 కోట్ల ఎకరాలు)
-ప్రక్షాళనలో పరిశీలించినది 2,55,098,091 ఎకరాలు
-వివాద రహిత భూములు 2,38,08,650 ఎకరాలు
-వివాదాలున్న భూములు 17, 89, 595 ఎకరాలు
-వివాదం లేని వ్యవసాయ భూమి 1,42,12,826 ఎకరాలు
-వ్యవసాయేతర భూములు 11,95, 889 ఎకరాలు
-ప్రభుత్వ ఆస్తులు 13,82,384 ఎకరాలు
-అసలుఅసైనీల చేతుల్లో ఉన్నది 20,01,512 ఎకరాలు
-ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి 7,21,694 ఎకరాలు
-వివాదాలు లేని అటవీభూమి 41,74,652 ఎకరాలు
-దేవాదాయ భూములు 74,128 ఎకరాలు
-వక్ఫ్ భూములు 45, 564 ఎకరాలు
-నగరాలు, గ్రామీణ నివాస ప్రాంతాలు 24 లక్షల ఎకరాలు

ప్రతిపాదిత నూతన రిజిస్ట్రేషన్ విధానం
-అమ్మేవారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌ను అపాయింట్‌మెంట్ అడుగాలి (పాస్‌పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్ల మాదిరిగా).
-భూమి అమ్మకానికి సంబంధించిన డాక్యుమెంట్ తయారుచేయడానికి లైసెన్సుడ్ డాక్యుమెంట్ రైటర్లను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉంచుతారు. వారు ఫీజు తీసుకుని రాసిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. అమ్మేవారు, కొనేవారు తామే స్వ యంగా డాక్యుమెంట్ రాసుకున్నా అనుమతిస్తారు. ఫారాలు-టెంప్లేట్లు అందుబాటులో ఉంచుతారు.
-అపాయింట్‌మెంట్ ఇచ్చిన తేదీ, సమయానికి క్రయ, విక్రయదారులు సబ్‌రిజిస్ట్రార్ ఎదుట హాజరుకావాలి.
-బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫొటోలు, సంతకాలు తీసుకొంటారు.
-ఎంతభూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్‌రిజిస్ట్రార్ తొలిగిస్తారు. అదే సమయంలో కొన్నవారి పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్‌రిజిస్ట్రార్ ముద్రవేసి, సంతకం చేస్తారు.
-భూమిని కొత్తగా కొన్నవారయితే కొత్త పాస్ పుస్తకం ఇస్తారు.కొనుగోలు వివరాలు నమోదుచేస్తారు..ఇద్దరి పాస్‌పుస్తకాలను అప్పుడే ఎమ్మార్వోకు పంపుతారు.
-సదరు భూమి యజమానిగా.. అమ్మినవారి పేరు తొలిగించి, కొన్నవారి పేరుపై మార్పిడి (మ్యుటేషన్) చేస్తారు.
-ఈ వివరాలన్నింటినీ ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎమ్మా ర్వో కార్యాలయంలోని ఐటీ అధికారికి ఈ వివరాలు పంపాలి. ఐటీ అధికారి వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తారు.
-వెబ్‌సైట్‌లో నమోదైన వివరాలు కొన్నవారికి, అమ్మినవారికి వెంటనే ఎస్సెమ్మెస్ (బ్యాంకుల లావాదేవీల మాదిరిగా) చేరుతాయి.
-పాస్ పుస్తకాలను ఇప్పటిమాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత పూర్తిగా ఎమ్మార్వోదే.
-పేరు మార్పిడి (మ్యుటేషన్) జరిగిన తర్వాత పాస్‌పుస్తకాలపై ఎమ్మార్వో కార్యాలయం ముద్రవేసి, ఎమ్మా ర్వో సంతకం చేస్తారు. ఆ పాస్ పుస్తకాలను అదేరోజు తిరిగి సబ్‌రిజిస్ట్రార్‌కు పంపుతారు.
-ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్‌పుస్తకాలను అమ్మినవారికి, కొన్నవారికి సబ్‌రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పంపుతారు (పాస్‌పోర్టుల మాదిరిగా).
-సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిస్పాచ్ అయిన వెంటనే ఇద్దరికీ ఎస్సెమ్మెస్ వెళుతుంది.
-రైతులకు ఇచ్చే పాస్ పుస్తకంలో ఖాతా నంబరుతోపాటు పాస్ పుస్తకం యూనిక్ కోడ్, గ్రామం కోడ్, మండలం కోడ్, యజమాని ఆధార్ నంబర్ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *