బిసి లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువు పెంచాలి – గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు
బీసీ కులవృత్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.లక్ష ఆర్థిక సహాయం పథకం దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతున్నందున దరఖాస్తుల గడువును పెంచాలన్నారు.
మొదట్లో అప్లికేషన్ల స్వీకరణ సజావుగానే సాగినా.. ఆ తర్వాతి నుంచి సర్వర్ మొరాయించడం మొదలు పెట్టిందన్నారు. దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగినా.. చివర్లో సబ్మిట్ చేశాక దాన్ని తీసుకోవడం లేదన్నారు. గంట సేపటిదాకా వేచి చూసినా ప్రయోజనం ఉండడం లేదన్నారు. ఈ నెల 20 వరకే గడువు విధించడం.. ఇంత తక్కువ గడువులోనూ సర్వర్ సతాయించి అప్లికేషన్లు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజులుగా సర్వర్ మొరాయిస్తున్నా.. సర్వర్ సమస్యను మాత్రం ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు.