అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి & ఏలా చేస్తారు?
అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి & ఏలా చేస్తారు?
నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనులనే “మనోవాక్కాయకర్మలు” అని అంటారు. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహవ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారు.
మహావ్రతాలు:
1) అహింస: హింస చేయకుండా యుండుట.
2) సత్యం: దేవుని యందు నిజమైన భక్తిని కలిగియుండుట.
3) ఆస్తేయము: అవలంబించేందుకు తగినది.
4) బ్రహ్మచర్యము: శారీరక వ్యామోహాలు లేకుండా భగవంతుని గూర్చి త్రికరణశుద్ధిగా చేసే పవిత్ర కార్యము.
5) అపరిగ్రహము: తన భోగసాధనలకై ధనాదులను, ఇతరుల నుండి పుచ్చుకోకుండా ఉండుట.
ఈ 5 వ్రతాలను త్రికరణశుద్ధిగా ఆచరించుటను “దీక్ష” అంటారు
అయ్యప్ప దీక్షా విధానం
14. అయ్యప్ప దీక్ష యొక్క ప్రాశస్త్యము, విశిష్టతలు ఏమిటి?
కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ, నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ , సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకొవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్థింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.
15. అయ్యప్ప దీక్షలో అందరిని “స్వామి” అని ఎందుకు పిలుస్తారు?
జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతోనే జీవులన్నిటిని “స్వామి” అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ “స్వామి” అనే పిలుస్తారు.
16. దీక్షలో పాటించవలసిన భోజన విధానం మరియు ఆహార నిబంధనలు ఏమిటి?
ఆహార నిబంధనలు లేని దీక్ష దీక్షయే కాదు. ఈ దీక్షలో నియమిత, పరిమిత, సాత్విక, సకాల, ధర్మార్జన శాఖాహారమును మాత్రమే భుజించాలనే నిబంధన కలదు.
దీక్ష సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భుజించవలెను. ఉదయం, రాత్రి సమయంలో ఫలహారమును తగిన మాత్రములోనే తీసుకొనవలెను. మధ్యాహ్నం 12 గంటలకు చేయటం ఉత్తమం, 1 గంటకు చేయటం మధ్యమం, 2 గంటలకు చేయటం అధమం.
భోజనానికి ముందు తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీక్షాకాలములో మసాలా దినుసులు గల ఆహారమును విడిచిపెట్టుట అలవాటు చేసుకోవాలి.
ఉప్పు కారములు తక్కువగా ఉండి, పక్వమైన, శుద్ధమైన ఆహారాన్ని సాత్వికమైన ఆహారమని అంటారు. అట్టి ఆహారమును దీక్షాకాలములో భుజించవలెను. సాత్విక శాఖాహారము శరీరమును తేలికపరుస్తుంది. మనస్సుకు శాంతిని, కోరికలకు దూరముగా భగవత్ధ్యానముకు ఏకాగ్రతను కలిగిస్తుంది.
అయ్యప్ప #దీక్ష అత్యంత పవిత్రమైనది. ఈ దీక్ష చిత్తశుద్ధిగా, భక్తితో చేయాలి. అయ్యప్ప, అయ్యప్ప దీక్ష ఇంకా దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ ఇవ్వబడినది.
1. అయ్యప్ప అంటే ఎవరు?
అయ్యప్ప అంటే “హరిహరసుతుడు”. అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. “అయ్యా” – “అప్ప” కలిసి “అయ్యప్ప” అని అంటారు. అయ్యప్పని “మణికంఠుడు”, “ధర్మశాస్త” అని కూడ అంటారు.
2. అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు?
శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు.
అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం).